నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 62వ ఆవిర్భావ దినోత్సవం లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవియా మాట్లాడుతూ ఆయుర్వేదం, యోగాను ఆధునిక వైద్య విధానాలతో అనుసంధానం చేయాలని అన్నారు. నివారణ ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్య విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపారు. వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఆధునిక మందులు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో కొవిడ్-19 నిర్వహణ, టీకా డ్రైవ్పై ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. మన దేశం కేవలం వ్యాక్సిన్ అభివృద్ధి మాత్రమే చేయకుండా, తయారీతో పాటు ఎగుమతులు కూడా చేసిందని నొక్కి చెప్పారు. దేశంలో ఎప్పుడు మానవ వనరులు, మేధస్సుకు కొరత లేదని అన్నారు. మనలోనే స్వీయ విశ్వాసం ఉండాలని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అన్నారు. మాండవియా అకాడమీ పరిశోధకులు పరిశోధన, ఆవిష్కరణలకు ప్రైవేట్ రంగంతో సహకరించమని ప్రోత్సహించారు.