సిరిసిల్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సిరిసిల్ల పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి అసలైన అర్థం చెబుతున్నారు. ప్రజా చైతన్యానికి పోలీస్ నేస్తం అనే కార్యక్రమంతో ప్రజల ముంగిటనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చట్టపరమైన, ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో సరైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న జిల్లా పోలీసులు వినూత్నంగా “పోలీస్ నేస్తం” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు క్షేత్రస్థాయిలో పలు అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపుర్ గ్రామంలో కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ నేస్తం అనే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలతో మమేకం కావడం జరిగిందని, గ్రామ ప్రజల వద్ద నుండి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు వారి గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాటి పైన త్వరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పాత కేసులు, పాత గొడవలు, రోడ్ ప్రమాదాలు మొదలగు సమస్యలు చెప్పారని, వాటిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ప్రజలకు రోడ్ భద్రత, ట్రాఫిక్ రూల్స్, సీసీ కెమెరాల ఉపయోగం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా, గల్ఫ్ సమస్యలు, డయల్ 100, షీ టీమ్స్ మొదలగు అంశాల మీద ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు, మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన జిల్లా షీ టీం నెంబర్ (+917901132113) కు కంప్లైంట్ చేయవచ్చని, ఇది మహిళ ఎస్.ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉంటుందని, అదేవిధంగా సోషల్ మీడియాలో అనవసర పోస్ట్ లు పెట్టకూడదని, వాట్స్ అప్ గ్రూపు లలో వచ్చే మెసేజ్ లు ఇతరులకు పంపకూడదని ఆయన కోరారు. జిల్లాలో సోషల్ మీడియా సెల్ (వాట్స్ అప్ నెంబర్ 6303922572)ఉందని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో పోలీస్ నేస్తం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికి, ఆ రోజున వచ్చి సమస్యలను చెప్పుకోవాలని, వాటిపైన ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, డ్రగ్స్, గంజాయి, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా ప్రభుత్వం నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయన్నారు. ఎవరు కూడా సమయం వృధా చేసుకోకుండా, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను తీసుకోవాలన్నారు. చెడు వ్యాసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఐ లు ఉపేందర్, అనిల్ కుమార్, ఎస్.ఐ శేఖర్, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)