దేశంలో 2,380 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశ రాజధాని దిల్లీలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేరళ, మిజోరం, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో కూడా వైరస్ ఉనికి చాటుతోంది. గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బుధవారం 4.49 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,380 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్క దిల్లీ నుంచే 1,009 కేసులొచ్చాయి. అక్కడ ఒక్కరోజులో కేసుల్లో 60 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ మృతుల సంఖ్య 53 కాగా, దిల్లీ, ఒడిశా, మిజోరంలో ఒక్కో మరణం సంభవించింది. నిన్న 1,231 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. దాంతో క్రియాశీల కేసులు 13,433కి పెరిగాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతం ఉండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది. మరోపక్క నిన్న 15.47 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. దిల్లీలో ఈ జనవరి నుంచి మార్చి వరకు సంభవించిన కొవిడ్ మృతుల నమూనాలను పరిశీలించగా 97 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ ఉన్నట్లు తేలింది. 578 నమూనాలను జన్యుక్రమాన్ని విశ్లేషించగా.. 560 నమూనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మిగిలిన నమూనాల్లో డెల్టాతో సహా ఇతర వేరియంట్లు ఉన్నట్లు పేర్కొన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)