శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం

Telugu Lo Computer
0


శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. స్కూళ్లలో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్‌, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. పేపర్‌ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు. ఈరోజు నుంచి జరగాల్సిన టర్మ్‌ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నా పత్రాల తయారీకి సరిపడ పేపర్‌ లేదని అందుకే పరీక్షలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని 30 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇక దిగుమతులకు సరిపడ విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో శ్రీలంక ఆహారం, ఇంధనం, ఔషధాల దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఎన్నడూ కనీవిని ఎరగని ఆర్థిక సంక్షోభం శ్రీలంకను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తోంది. నిధుల కొరతతో దేశం ఆర్థికంగా పూర్తిగా పతన స్థితికి చేరుకుంది. ఇప్పటికే దేశ అవసరాలకు సరిపడ ఇంధనం దిగుమతి చేసుకోలేక శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలో విద్యుత్‌ కోతలు కూడా మొదలయ్యాయి. కరోనా తర్వాత పరిణామాల నేపథ్యంలో శ్రీలంకలో టూరిజం పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థిక కష్టాలు మొదలై ఇప్పుడు అవి పీక్స్‌కి వెళ్లిపోయాయి. 2 కోట్ల 20 లక్షల జనాభా ఉన్న శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. విదేశీ మారక నిల్వలు 1.6 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులకు డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం ఆహార వస్తువులు సహ అనేక నిత్యావసర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక లో ఏం కొనేటట్ట లేదు నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కోడి గుడ్డు రూ. 35 లు ఉండగా ఉల్లిపాయలు కిలో 200 నుంచి 250 రూపాయలదాకా అమ్ముతున్నాయి. కిలో చికెన్ ధర రూ. 800 కి చేరింది. కిలో గోధుమ పిండి రూ.170-200, లీటర్ పెట్రోల్ రూ. 283 లు కాగా డీజిల్ 220కి అమ్ముతున్నారు. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 270 కి పడిపోయింది. పెట్రోల్ కోసం పడిగాపులు కాచి ఇద్దరు వృధ్దులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంధన కొరత తీర్చటానికి ఇండియా నుంచి పెట్రోల్ ,డీజిల్ తెప్పించుకున్నట్లు సిలోన్ పెట్రోలియం కార్పోరేషన్ ఛైర్మన్ సుమిత్ తెలిపారు. రోజుకు మూడు పూటలా తిండి తినలేకపోతున్నామని అక్కడి కుటుంబాలు వాపోతున్నాయి. రోజు కూలీ పని చేసుకొని పొట్టపోసుకునేవారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిగుమతులపై ఆంక్షలు, పెరుగుతున్న ఇంధనం ధరలు, రవాణా ఛార్జీల కారణంగా పాల పొడి, బియ్యం వంటి అత్యవసర వస్తువుల ధరలు కొండెక్కాయి. గత నాలుగు నెలల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు రెట్టింపు అయింది. దీంతో చాలా మంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దేశంలోని డెయిరీ పరిశ్రమ స్థానిక అవసరాలు తీర్చలేక పోతుండటంతో.. పాలపొడిని శ్రీలంక దిగుమతి చేసుకుంటోంది. పెరిగిన ధరల కారణంగా తాము బతకలేమని వేతన జీవులు వాపోతున్నారు. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రేషన్‌ షాపుల దగ్గర భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. శ్రీలంకలో ఆహార పదార్థాల ధర గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 21.1 శాతం పెరిగింది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. కొవిడ్‌ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్లు ఆర్జించింది. కరోనా కారణంగా అది 90శాతం వరకు పడిపోయింది. తమ దగ్గర కూడా ఎటువంటి ఆప్షన్స్ లేవని శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. పెరుగుతున్న ధరలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల 1బిలియన్‌ ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచి పేదలకు కొంత మేర ఆదుకుంది. అలాగే ఆహార వస్తువులు, ఔషధాల ధరలపై పన్నులు తొలగించింది. గతంలో జరిగిన ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు తీవ్రమైన ముప్పుగా మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు లంక ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా బెడిసి కొట్టడంతో ఆ దేశం పరిస్థితి దుర్భరంగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)