మందలించాడని తమ్ముడిని చంపించిన అక్క

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని కళానగర్‌లో నివాసముంటున్న మహ్మద్‌ అబ్దుల్‌ సోహెల్‌ (19) గత సంవత్సరం సెప్టెంబర్‌ 4న ఇంట్లోంచి వెళ్లిపోయాడని పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. సోహెల్‌ అక్క నిషత్‌ ఫాతిమా (21) సజ్జత్‌ అలీ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండేది. ఆ విషయంలో సోదరుడు సోహెల్‌ అక్క పాతిమాను హెచ్చరించాడు. సోహెల్‌ తన స్నేహితుడైన బాలుడి (17)కి చెప్పి ఆమెను బెదిరించాడు. దీంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. సోహెల్‌ను చంపితే రూ.లక్ష సుపారీ ఇస్తానని తనను బెదిరించిన బాలుడితో ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్‌ 4న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు, సోహెల్‌ను పట్టణంలోని ఎస్సారెస్పీ ప్రధానకాలువ పక్కన ఉన్న దోబీ ఘాట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సజ్జత్‌ అలీ, మరో స్నేహితుడు ఎం.డి మహ్మద్‌ (19), ఆ బాలుడు, సోహైల్‌ కలిసి మద్యం తాగారు. అనంతరం గొడవ జరగ్గా సోహెల్‌ తలపై బీరు సీసాలతో కొట్టి, దోబీఘాట్లో దొరికిన చీరతో మెడకు ఉరి బిగించి చంపారు. శవం ఆధారం దొరకకుండా నీళ్లు ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పడేశారు. సోదరి ప్రియుడు, నిందితుడైన సయ్యద్‌ సజ్జత్‌ అలీ అలియాస్‌ షాబాద్‌ (25) సోమవారం జగిత్యాలకు చెందిన ఖాజీ కుతుబుద్దీన్‌ అనే వ్యక్తితో వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సజ్జత్‌ అలీని విచారించగా హత్య పూర్తి వివరాలు తెలిపాడు. విచారణలో మిగతా నేరస్థులు నేరాన్ని అంగీకరించారు. హత్యకు కారకులైన సయ్యద్‌ సజ్జత్‌ అలీ, బాలుడు, ఎం.డి.మహ్మద్‌, మృతుని సోదరి నిషత్‌ ఫాతిమాలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిచామని పోలీసులు తెలిపారు. తమకు శవం చూపాలంటూ మృతుడి బంధువులు స్టేషన్‌కు తరలివచ్చారు. మృతదేహాన్ని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వారిని డీఎస్పీ శాంతింపజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)