తిరుమల కొండపై ప్రైవేటు హోటళ్ల తొలగింపు

Telugu Lo Computer
0


గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో తిరుమల కొండపై త్వరలో ప్రైవేటు హోటళ్లనుతొలగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లు తొలగించాలని, తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. సీఎం అయినా, సామాన్య భక్తుడైనా టీటీడీ అన్న ప్రసాదం తినాల్సిందేనని స్పష్టం చేసింది. శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, ఆనంద నిలయాలకు బంగారు తాపడం పనులు చేయించాలని, అన్నమయ్య మార్గం రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆర్జిత సేవా టికెట్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను భారీగా పెంచింది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను ప్రారంభిస్తూనే టికెట్‌ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. సాధారణంగా సుప్రభాత సేవకు 120 రూపాయలు, సిఫార్సు లేఖపై 240 ఉండగా దాన్ని రెండు వేల రూపాయలకు పెంచింది. తోమాల అర్చన సేవకు కూడా సాధారణంగా 220, సిఫార్సు లేఖపై 440 ఉన్న ధరను ఐదు వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. అలాగే కళ్యాణోత్సవం, వేద ఆశీర్వచనం టికెట్‌ ధరలను భారీగా పెంచేందుకు సమాయత్తమైంది. కళ్యాణోత్సవం సేవ టికెట్‌ ధర గతంలో వెయ్యి రూపాయలు ఉండగా.. రెండు వేల ఐదు వందలకు, మూడు వేలు ఉన్న వేద ఆశీర్వచనం టికెట్‌ ధరను 10 వేలకు పెంచింది. ఇక వస్త్రాలంకరణ సేవ టికెట్‌ ధరను 50 వేల నుంచి ఏకంగా లక్ష రూపాయలకు పెంచింది

Post a Comment

0Comments

Post a Comment (0)