కరోనా తగ్గుముఖం పట్టడంతో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేస్తామన్నారు. తితిదే ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళమిచ్చిన వారికి ఈనెల 16 నుంచి ఉదయాస్తమాన టికెట్లు జారీ చేయనున్నట్లు ఈవో తెలిపారు. తితిదే వెబ్సైట్ ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్ల బుకింగ్కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఆన్లైన్ ద్వారా విరాళమిచ్చి ఉదయాస్తమాన సేవ టికెట్ పొందవచ్చునన్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు, అర్చకులుస్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి కలసి తిరుమలేశుని తీర్థప్రసదాలను అందజేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణితో కలసి తిరుమలేశుని ఆశీస్సులు అందుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కిషన్రెడ్డి వెల్లడించారు. జమ్మూలో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. పంచగవ్య ఉత్పత్తులు, గో రక్షణ చర్యలతో గోమాతపై గౌరవం పెరిగిందని తెలిపారు. అంతకు ముందు తిరుమలలోని పుష్పగిరి మఠం వద్ద జరిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు.
శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని తితిదే నిర్ణయం
February 10, 2022
0
Tags