ఆన్ లైన్ బుకింగ్స్ లో 'సన్నాఫ్ ఇండియా' సరికొత్త రికార్డ్!

Telugu Lo Computer
0


మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన "సన్నాఫ్ ఇండియా" సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ బుకింగ్స్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గత రెండు రోజులుగా 'సన్నాఫ్ ఇండియా' సినిమా ఆన్ లైన్ టికెట్ల బుకింగ్స్ పై సోషల్ మీడియాలో మరో సినిమా రన్ అవుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో కేవలం పదుల సంఖ్యలో ఈ సినిమా ఆన్ లైన్ టికెట్లు బుక్ కావడం అనేది అంచనాలకందని విషయం. మోహన్ బాబు ఏమీ కొత్త నటులు కాదు, ఓ లెజెండరీ యాక్టర్ అని ఇటీవల తాడేపల్లిలో జగన్ నివాసానికి విచ్చేసిన సమయంలో 'మా' ప్రెసిడెంట్ గా వ్యవహారిస్తోన్న మంచు విష్ణు సైతం తెలిపారు. ఇటీవల కాలంలో కొత్త కొత్త నటులు కూడా బాక్సాఫీస్ వద్ద "డీజే" వాయించేస్తున్న తరుణంలో, 'కలెక్షన్ కింగ్' సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ లేకపోవడం అనేది పబ్లిసిటీ లోపమా? ప్రేక్షకులకు ఆసక్తిని పెంచే విధంగా టీజర్, ట్రైలర్స్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ చూపించిన అలసత్వం అనుకోవాలా? లేక ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ వేదికగా జరిగిన పరిణామాల ఫలితామా? ముందుగా పబ్లిసిటీ విషయానికి వస్తే ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. చిరునే ఓ పబ్లిసిటీ కాగా, అది జరిగి చాలా నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత 'సన్నాఫ్ ఇండియా' పేరు ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేయడంలో చిత్ర యూనిట్ విఫలమైందనే చెప్పవచ్చు. అందులోనూ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో మోహన్ బాబును మరీ ఓవర్ గా చూపించారన్న టాక్ ప్రేక్షకుల నుండి వ్యక్తమయింది. అలా ఆడియన్స్ ను తమ సినిమా వైపుకు తిప్పుకోవడంలో మోహన్ బాబు అండ్ కో పూర్తిగా విఫలమైంది. అలాగే ఇటీవల మీడియా వేదికలుగా ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలు కూడా 'సన్నాఫ్ ఇండియా' పబ్లిసిటీకి కాకుండా, మోహన్ బాబు చెప్పిన ఇతర అంశాలకు ప్రాధాన్యత లభించి అవి హైలైట్ అయ్యాయి. దీంతో 'సన్నాఫ్ ఇండియా' ప్రేక్షకులకు బహు దూరంగా జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)