ధూమపానం - గుండె జబ్బులు

Telugu Lo Computer
0


చిన్నతనం లోనే గుండె జబ్బుల బారిన పడి మరణించిన యువత సంఖ్య పెరుగుతోంది. అంతెందుకు 2015లో భారతదేశంలో దాదాపు ఆరుకోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని, వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపేనని ఒక సర్వే తేల్చింది. ఆధునిక కాలంలో ఇలా గుండె సంబంధ వ్యాధులు పెరిగిపోవడానికి లైఫ్‌స్టైల్ ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో ఒత్తిళ్లు, చెడు ఆహారపు అలవాట్లతో పాటూ ధూమపానం ప్రధాన పాత్ర వహిస్తోంది. ఒక ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటు దూరంగా ఉంటే గుండె పోటు వచ్చే అవకాశాలు సగం వరకు తగ్గిపోతాయి. రోజూ ధూమపానం చేసే వారిని  చేయని వారితో పోలిస్తే కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం అధికం అని  వైద్యులు చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను శాతం మంది గుండె సంబంధ మరణాలు సంభవిస్తున్నాయి. ఇదొక్కటే కాదు బ్రెయిన్ స్ట్రోక్‌లు, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, కాళ్లల్లో ధమనులు గట్టిగా మారడం వంటివి సంభవిస్తాయి. ధూమపానం గుండె కండరాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లే రక్తనాళాల్లో గడ్డలు, ఫలకాలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా పెరుగుతుందని కార్డియాలజిస్టులు వివరిస్తున్నారు. కాబట్టి ధూమపానం అలవాటున్న వారు వెంటనే దాన్ని వదిలివేయడం అన్ని విధాలా మంచిది. గుండెకు రక్షణను, ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని ఏరికోరి తినాలి. ముఖ్యంగా సాల్మాన్, టూనా, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సముద్రపు చేపలు తరచూ తినాలి. ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు ఇవి చాలా అవసరం. ఓట్స్‌ను రోజూ తినడం మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరంలో చేరిన కొవ్వును ఇది తగ్గిస్తుంది. గుండెలోని ధమనుల్లో ఇన్‌ఫ్లమ్మేషన్ సమస్య రాకుండా ఉండాలంటే బాదం, వాల్‌నట్స్, కిస్‌మిస్లు, జీడిపప్పులు, ఖర్జూరాలు, అంజీర్లు వంటి నట్స్ రోజూ ఓ గుప్పెడు తినాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడ దుంపలు అధికంగా తీసుకోవాలి. మద్యపానం పూర్తిగా మానివేయాలి. మాంసాహారం అతిగా కాకుండా మితంగా తినాలి. అతిగా తింటే కొవ్వు చేరే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)