కొవిడ్ కాలంలో ఐటీ కంపెనీలు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఉద్యోగులు రెండు లేదా అంతకంటే ఎక్కువ జాబ్స్ చేస్తున్నారని కొన్ని కంపెనీలు గుర్తించాయి. దీంతో ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా భయాలు ఇంకా ఉన్నప్పటికీ ఉద్యోగులను ఆఫీస్లకు పిలవాల్సిన అవసరం కనిపిస్తోందని అభిప్రాయ పడుతున్నాయి. హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ లేదా ప్రత్యేక విభాగాల ద్వారా ఎక్కువ జాబ్స్ చేస్తూ సంస్థకు నష్టం చేకూరుస్తున్న వారిని నియంత్రించాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కొవిడ్ కారణంగా దాదాపు అన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చి పడింది. పగటి పూట పని చేస్తున్న ఉద్యోగులు, తమ పని గంటలు అయిపోగానే ఎక్కువ ఇన్కమ్ కోసం రాత్రి మరో జాబ్ చేస్తున్నారు. దీన్ని మూన్లైటింగ్ ఎఫెక్ట్ అంటున్నారు. దీంతో అసలు కంపెనీల రెవెన్యూ, ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని ఐటీ సంస్థలు చెబుతున్నాయి. ఈ కారణాలతో ఉద్యోగులను ఆఫీస్లకు పిలిపించాల్సిన అవసరం కలుగుతోందని చెబుతున్నాయి. వారంలో కొన్ని రోజులైనా ఆఫీస్లకు వచ్చేలా చూడాలని భావిస్తున్నాయి. దీనిపై ఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఓ ఉద్యోగి ఒకే సారి ఏడు కంపెనీలకు పని చేస్తున్నాడని ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. అలా పని చేస్తున్న ఉద్యోగి ఎవరు, ఏ కంపెనీలకు పని చేస్తున్నాడనే విషయం కూడా తెలుసని, అతని పీఎఫ్ రికార్డులను పరిశీలిస్తే ఎంప్లాయిమెంట్ డీటైల్స్ కనిపిస్తాయని అన్నారు. సంస్థలో పని చేస్తున్న హెచ్ ఆర్ మేనేజర్ ఈ విషయాన్ని కనిపెట్టారని, చాలా పీఎఫ్ అకౌంట్లు యాక్టివ్లో ఉండటంతో అనుమానం వచ్చిందని తెలిపారు. ఇలాంటి వారిని కనిపెట్టడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. మరో కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇండియాలో ఉద్యోగులకు సంబంధించి సెంట్రలైజుడ్ డేటాబేస్ లేదని అన్నారు. దీంతో ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే మూన్లైటర్స్ని కనిపెట్టడం కష్టంగా మారుతోందని చెప్పారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగులు ఎంప్లాయ్స్ ట్యాక్స్ ఫైలింగ్, పీఎఫ్ అకౌంట్లో ఇన్కమ్ శాలరీ అని ఉందా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ఉందా చూసుకోవాలని సూచించారు. మూన్లైటింగ్తో ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని న్యాయస్థానాలు గుర్తించాయని నిపుణులు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలకు, కొన్ని ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్కు సంబంధించి లేబర్ లాలో కొన్ని నియమాలు ఉన్నాయని, రెండు ఉద్యోగాలు చేయడం నేరం కిందకు వస్తుందని వివరించారు. కొన్ని టెక్నాలజీ సంస్థలు ఎంప్లాయ్ అగ్రిమెంట్లోనే డ్యుయల్ జాబ్స్ చేయకుండా నిబంధనలు పేర్కొంటారని, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కాకుండా మరేదైనా చేస్తే చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. హైబ్రిడ్ వర్క్ఫోర్స్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందులో పార్ట్ టైమర్స్ కూడా ఉండాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ అనే ఛాయిస్ ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. డిఫరెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ మధ్య ఉద్యోగులను పని చేయిస్తే, హైబ్రిడ్ స్ట్రక్చర్ సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో పని చేసే విధానాలు పూర్తిగా మారుతాయని చెప్పారు.
ఐటీ కంపెనీలకు మూన్లైటర్స్ బెడద!
February 08, 2022
0
Tags