మూడు కేటగిరీల్లో ఇండ్ల స్థలాల కేటాయింపు

Telugu Lo Computer
0


తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంఐజీ వెబ్ సైట్‌ ను ప్రారంభిస్తూ మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మధ్య తరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ కంటే తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వమే అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుందని, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని విధంగా ప్లాట్లు ఏర్పాటు చేశామన్నారు. సంక్రాంతి పండుగ వేళ దీనికి శ్రీకారం చుడుతున్నామని  మూడు కేటగిరీల్లో స్థలాల పంపిణీ ఉంటుందని చెప్పారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, వైయస్సార్‌ జిల్లా రాయచోటి, ఒంగోలు జిల్లా కందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ లే అవుట్లు వేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో హెడ్‌ క్వార్టర్స్‌ లో దీన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన వెబ్‌ సెట్‌ ను ప్రారంభిస్తున్నామని అన్నారు. 18 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న వారు జగనన్న టౌన్స్‌ లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపారు. నివాసం ఉన్న ప్రాంతంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపులు పూర్తికాగానే డెవలప్‌ చేసిన ప్లాట్‌ ను చేతికి అందిస్తామని,  ప్లాట్ల నిర్ణీత విలువలో మొదట 10శాతం చెల్లించాలని తెలిపారు. అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత ఆరు నెలల్లోపు 30 శాతం, మిగతాది 12 నెలల్లోగా లేదా రిజిస్ట్రేషన్‌ తేదీలోగా చెల్లించాలని వెల్లడించారు. ఇక, మొన్న పీఆర్సీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చాం.. 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌ చేస్తూ, 20 శాతం రిబేటుతో ఇస్తామన్నారు సీఎం జగన్. అన్నిరకాల నిబంధనలను పాటిస్తూ.. ఏడాదిలో సమగ్ర లే అవుట్‌ అభివృద్ధి చేసి మోడల్‌ లే అవుట్‌ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న విషయానికొస్తే పూర్తి పారదర్శకతతో కేటాయిస్తామన్న ఏపీ సీఎం.. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధాలు లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో చేస్తామని వెల్లడించారు. 150 గజాలు, 200 గజాలు, 240 గజాల స్థలాలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుందని, లే అవుట్‌ విస్తీర్ణంలో 50 శాతం స్థలం కాలనీలో ఉమ్మడి అవసరాలకు వినియోగిస్తామని వివరించారు. పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు తదితరాల కోసం కేటాయిస్తామని తెలిపారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, కలర్‌ టైల్స్‌ తో ఫుట్‌ పాత్‌ లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎవ్వరూ వేలెత్తి చూపించలేని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. లే అవుట్‌ డెవలప్‌ మెంట్‌ కోసం కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)