బస్సు తలుపు ఊడి.....!

Telugu Lo Computer
0


తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీడిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ పి రూబెన్‌ (55) అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం వేకువ జామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు డిపో నుంచి సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సు 26 మంది ప్రయాణికులతో గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. పి రూబెన్‌, ఎస్‌కే బాషా బస్సు డ్రైవర్లు. ప్రొద్దుటూరు నుంచి ఎస్‌కే బాషా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో ఎస్‌కే బాషా డ్రైవింగ్‌ మారాల్సి ఉంది. అంతవరకు నిద్రపోయిన రూబెన్‌ వేకువ జామున సుమారు 3.40 గంటల సమయంలో డ్రైవింగ్‌ మారేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్‌పూర్‌ సమీపంలోకి వెళ్లగానే తను డ్రైవింగ్‌ చేస్తానని, బస్సు నిలపాలని రూబెన్‌  అడిగాడు. కొంత దూరం వెళ్లాక దిగుతానని డ్రైవింగ్‌ చేస్తున్న ఎస్‌కే బాషా తెలిపాడు. జడ్చర్ల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో డోర్‌ ఊడిపోవడంతో అక్కడే నిల్చున్న రూబెన్‌ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఎడమవైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో మరో డ్రైవర్‌ ఎస్‌కే బాషాతో పాటు ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)