కుప్పంలో కిడ్నాప్‌ కలకలం

Telugu Lo Computer
0


తన తమ్ముడు ప్రకాష్‌, అతని భార్య, కుమారులను తెదేపా నాయకులు కిడ్నాప్‌ చేశారని గోవిందరాజు అనే వ్యక్తి కుప్పం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదుచేశారు. మాజీమంత్రి అమరనాథరెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌, రెస్కో మాజీ ఛైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, మాజీ సర్పంచి వెంకటేష్‌ తమ వాహనాలలో ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రకాష్‌ ఇంట్లో ఉండగా బెదిరించి వాహనాల్లో ఎక్కించుకున్నారన్నారు. ప్రకాష్‌, అతని భార్య తిరుమగల్‌ ఇద్దరూ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డులో తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే వార్డులో తెదేపా నుంచి బరిలోకి దిగిన వెంకటేష్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు శనివారం తిరస్కరించారు. తమ అభ్యర్థులను తామే ఎలా కిడ్నాప్‌ చేస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. కుప్పంలో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోందా? అన్నారు. సొంత పనిపై రెండు రోజుల క్రితం బయటకు వచ్చామని ప్రకాష్‌, ఆయన భార్య తిరుమగల్‌ పేర్కొన్నారు. ఆదివారం వారు తమ పిల్లలతో కలిసి ఉన్న వీడియోను విడుదల చేశారు. తమ ఫోన్లు స్విచాఫ్‌ కావడంతో.. తమవాళ్లు తప్పుగా అర్థం చేసుకొని కిడ్నాప్‌ అయినట్లు ఫిర్యాదు చేశారని, రెండు రోజుల్లో కుప్పం వచ్ఛి. తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొంటామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)