ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల వెల్ఫేర్ సలహాదారుగా నియమించింది. చంద్రశేఖర్ రెడ్డి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఎన్ చంద్రశేఖర్రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం కొరకు) పదవి చేపట్టారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్కు చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయం నెరవేర్చుటకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు ఏ సమస్య గురుంచి అయినా, ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చని సూచించారు. ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలు నెరవేరే విధంగా కృషి చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి
November 01, 2021
0