గీతా దత్ నేపథ్య గాయని, శాస్త్రీయ కళాకారిణి. ఈమె అసలు పేరు గీతా ఘోష్ రాయ్ చౌదరి. ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఇదిల్ పూర్ అనే గ్రామంలో ఒక జమీందారీ కుటుంబంలో 10వ సంతానంగా జన్మించింది. 1953 లో ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు గురుదత్ ని వివాహం చేసుకుంది. తర్వాత ఈమె పేరు గీతా దత్ గా మారింది. 1959 లో ఈవిడ పాడిన ‘వక్త్ నే కియా క్యా హసీ సితమ్ ... హమ్ రహేన హమ్ తుమ్ రహేన హమ్’... అనే పాట కాగజ్ కే ఫూల్ చిత్రంలో చాలా ప్రజాదరణ పొందింది. మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్ కంటే ముందు సురయ్యా, షంషాద్ బేగంల జమానాలో సూపర్స్టార్. అప్రమేయంగా పాట పాడటం ఆమెకు వచ్చు. గొంతు సవరించుకోవడం, ఈ శృతి ఎక్కువో తక్కువో అని నసగడం ఆమె ఎరగదు. కోల్కతా నుంచి పాటను తన జడపువ్వుగా ధరించి ముంబై చేరుకుంది. ఎన్నో పాటలను సువాసనలుగా వెదజల్లింది. అయితే ఇంకొన్నాళ్లు నిలిచి ఉండకుండా ఎండి తొందరగా రాలిపోయింది. మేరా సుందర్ సప్నా బీత్ గయా’ అనేది ఆమె ‘దో భాయ్’ (1947) లో పాడిన చాలా పెద్ద హిట్ పాట. అందమైన కల గడిచిపోయిందని ఆ పల్లవికి అర్థం. అందమైన కలను కనడం అది తొందరలోనే గడిచిపోవడం గీతాదత్ జీవితంలో కూడా జరిగింది. ఆమె గురుదత్ స్టార్ డైరెక్టర్ కాక మునుపే, చిన్న స్థాయి నటుడిగా ఉండగానే అతణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ సమయానికి ఇండస్ట్రీలో ఆమె అధికురాలు. గురుదత్ ఆమెను నిజంగానే ప్రేమించారు. వారిది ప్రేమపూర్వక జంటగా ఉంది. అతడు నట దర్శకుడిగా, ఆమె గాయనిగా ఇండస్ట్రీలో పెద్ద ప్రభావం చూపారు. గీతా దత్ ఓ.పి.నయ్యర్, ఎస్.డి.బర్మన్లతో గొప్ప పాటలు ఇచ్చింది. నయ్యర్ సంగీతంలో గీతా పాడిన ‘బాబూజీ ధీరే చల్నా’ (ఆర్ పార్), ‘ఠండి హవా కాలి ఘటా’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘మేరా నామ్ చిన్చిన్చు’ (హౌరా బ్రిడ్జ్) ప్రేక్షకులను అత్యంత ప్రీతిపాత్ర మయ్యాయి. గీతా పాడిన ‘చిన్ చిన్ చు’తో హెలెన్ డాన్సింగ్ స్టార్ అయ్యింది. ఇక ఎస్.డి, బర్మన్తో గీతాది తిరుగులేని జోడి. ఆయన కోసం ఆమె పాడిన ‘తద్బీర్ సే బిగ్డీ హుయీ’ (బాజీ), ‘జానే క్యా తూనే కహీ’ (ప్యాసా) యాభై ఏళ్లు గడిచిపోయినా నేటికీ శ్రొతల ఆదరణను చూరగొంటున్నాయి. ‘ఏలో మై హారీ పియా’ (ఆర్ పార్), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘పియా ఐసో జియా మే సమా గయేరే’ (సాహిబ్ బీవీ ఔర్ గులామ్)... లాంటి ఎన్నో సుప్రసిద్ద పాటలని ఆలపించింది. ఇన్ని పాటలు పాడిన ఈ సుమధుర గాయని, తన జీవిత చరమాంకంలో ఆర్థిక బాధలనుండి గట్టెక్కడానికి స్టేజీ షోలు చేయవలసి వచ్చింది. భర్త గురుదత్ 1964లో మరణించారు. అతడిది ఆత్మహత్య అని అంటారు. ఆ తర్వాత గీతా దత్ 1972 వరకూ జీవించి మరణించింది. మరణించే నాటికి ఆమె వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే.
జానే క్యా తూనే కహి
జానే క్యా మైనే సునీ
బాత్ కుఛ్ బన్ హీ గయి
జానే క్యా తూనే కహి .....
ఆమె 1930 నవంబర్ 23 న జన్మించారు .ఆమె జన్మించిన ప్రదేశం ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో ఉన్నది .కుటుంబం 1940 లో కలకత్తా షిఫ్ట్ అయింది. తనకు 12 సం వయసులో ముంబై లోని బెంగాల్ హైస్కూల్ లో ప్రాథమిక మాధ్యమిక విద్యను పూర్తిచేశారు . సంగీత దర్శకుడు కే హనుమాన్ ప్రసాద్ ఆమెకు సంగీతం లో మెళకువలు నేర్పించారు .1946 లో అతని సంగీత దర్శకత్వం లో భక్త ప్రహ్లాద చిత్రంతో గీతాదత్ సినీ రంగ ప్రవేశం చేశారు. బాజి చిత్రం కోసం పాటలు రికార్డింగ్ చేస్తున్న సమయంలో వర్ధమాన దర్శకుడు శ్రీ గురుదత్ తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వారిరువురు 1953 మే 26 న వివాహం చేసుకున్నారు .వారికి ముగ్గురు సంతానం .1957 లో గురుదత్ నిర్మించిన గౌరి చిత్రంలో గాయనిగా నటిగా ఈమెకు అవకాశం ఇచ్చారు. ఇది మొదటి సినిమాస్కోప్ చిత్రం. కానీ చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోయింది .గురుదత్ వహీదా తో ప్రేమాయణం సాగించడంతో గీత తాగుడుకు బానిస అయింది . గురుదత్ తో వివాహం విచ్ఛిన్నం కావడంతో ఆమె కెరీర్ దెబ్బతిన్నది .1958 లో సంగీత దర్శకుడు ఎస్ డి బర్మన్ గాయని లత తో విభేదాల కారణంగా గీతాదత్ తో పాటలు పాడించారు .1964 లో గురుదత్ తాగుడుకు బానిసై మరణించడంతో గీతాదత్ అనారోగ్యం పాలై ఆర్ధిక పరిస్థితులు తలకిందులవడంతో గాయనిగా కెరీర్ కు తెరపడింది. తనకు 41 సం.వయసులోనే 1972 జులై 20 న మరణించారు .