ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంచాం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని 130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ తెలిపారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వమిదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ వార్షిక పరిమితి రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ''దాదాపు రూ.10లక్షల ఖరీదైన బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌, మూగ, చెవిటి పిల్లలకోసం రూ.12 లక్షలు ఖరీదైన బైకా క్లియర్‌ ఆపరేషన్‌, రూ.11 లక్షల ఖరీదైన హార్ట్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, రూ.6.30 లక్షలు, 9.30 లక్షల ఖరీదైన స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో కత్తిరింపుల కార్యక్రమం లేకుండా పేదవాడిని బతికిస్తుందనే భరోసా కల్పించాం. ఈ పథకం ఓ గొప్ప విప్లవం. 29 నెలల్లో ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.4 వేల కోట్లు. గత ప్రభుత్వం నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు ఏడాదిపాటు పెట్టిన బకాయిలు రూ.680 కోట్లు చెల్లించకుండా వదిలేస్తే ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎక్కడా కూడా పెండింగ్‌ బిల్లులు లేకుండా చూస్తున్నాం. 21 రోజులు దాటితే నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా సీఎంఓ కార్యాలయమే స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఆ విధంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు కనీవినీ ఎరుగని రీతిలో విస్తరించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు కచ్చితంగా పేదవాడికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది. గతంలో 1,009 ప్రొసీజర్లు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2,446 ప్రోసీజర్లకు విస్తరింపజేశాం. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మరిన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే విధంగా చూస్తాం'' అని సీఎం జగన్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)