ఉత్తరాఖండ్లో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు నైనిటాల్ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామ్గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించారు. వరద ఉద్ధృతికి పలు చోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్పై వంతెన మీదకు రావడం గమనించిన స్థానికులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక చంపావత్ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కొట్టుకుపోయిన వంతెనలు
October 19, 2021
0