ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లాలో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్ గావ్ లోని రాయ్ ఘడ్ రోడ్డులో దుర్గా మాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్నభక్తులపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం పాతల్గావ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇక,ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ప్రమాదానికి కారణమైన కారుని వెంబండించి పట్టుకుని తుగులబెట్టారు. కారు డ్రైవర్ ని చితకబాదారు. కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు తెలుస్తోంది. జష్పూర్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు కారు ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో బబ్లూ విశ్వకర్మ(21), శిశుపాల్ సాహు(26) ఉన్నారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్ కు చెందినవారు. చత్తీస్ ఘడ్ మీదుగా వారు ప్రయాణిస్తున్నారు.