లాల్ బహాదుర్ శాస్త్రి

Telugu Lo Computer
0

 



లాల్ బహాదుర్ శాస్త్రి  భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరారు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్ లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యారు.1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టారు.శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా  తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగారు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించారు. ఆయన  నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది. శాస్త్రి వారణాసి లోని రామనగర లో తన తల్లి తరపున తాత గారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఆ కుటుంబం సాంప్రదాయకమైన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ . సివిల్ సర్వెంట్స్ ఉన్న నేపధ్యం కలది. అతని తండ్రి తరపున పూర్వీకులు వారణాసి దగ్గరలోని రామనగర లో జమీందారుల వద్ద పనిచేసేవారు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయులుగా పనిచేసారు.తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు. ఆమె తల్లి మొఘల్ సరాయ్ లోని రైల్వే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు. ఆంగ్ల ఉపాద్యాయునిగా పనిచేసిన మున్షీ హజారీ లాల్ కుమార్తె.1906 ఏప్రిల్ లో శాస్త్రికి ఒక యేడాది వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందారు కానీ ప్లేగు అనే అంటువ్యాధికి గురై మరణించారు. ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె తన కన్నవారి ఇంటికి (ముఘల్‌సరాయ్) వచ్చి అక్కడ స్థిరపడింది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించారు. అక్కడ ఆమె సుందరీ దేవి అనే కుమార్తెకు జూలై 1906 న జన్మనిచ్చింది. ఆ విధంగా శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్ ఇంటి వద్ద పెరిగారు. హజారీలాల్ 1908లో గుండెపోటుతో మరణించారు. తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకున్నారు.

దర్బారీలాల్ ఘజీపూర్ లోని "నల్లమందు నియంత్రణ విభాగం" లో ప్రధాన గుమస్తాగా పనిచేస్తూండేవారు. తరువాత దర్బారీలాల్ కుమారుడు బిందేశ్వరి ప్రసాద్, ముఘల్‌సరాయ్ లో ఉపాద్యాయునిగా పనిచేసారు. అన్ని కాయస్థ కుటుంబాల మాదిరిగానే శాస్త్రి కుటుంబంలోని పిల్లలకు ఉర్దూ భాష, సంస్కృతిలో విద్యను అందించే ఆచారం ఉంది. ప్రభుత్వంలో ఆంగ్ల భాష రాక ముందు అనేక శతాబ్దాలుగా ఉర్దూ/పర్షియన్ భాషలు వాడబడుతున్నందున ఈ భాషలు నేర్చుకోవాలనే ఆచారం ఆనాడు ఉండేది. అందువలన శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయస్సులో ముఘల్‌సరాయ్ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వీ వద్ద విద్యను అభ్యసించారు. అక్కడ 6వ తరగతి వరకు చదివాడు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్ కు వారణాసి కి బదిలీ అయింది. అందువల్ల కుటుంబం అంతా వారణాసి వెళ్లవలసి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు రామ్‌దులారీ దేవి తన ముగ్గురు పిల్లలతో కలసి వారణాసి చేరింది. శాస్త్రి హరిష్ చంద్ర హైస్కూలు లో ఏడవ తరగతిలో చేరారు. ఇక్కడ అతను తన పేరులోని "శ్రీవాస్తవ" అనే ఇంటిపేరును వదిలివేసారు. నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది. శాస్త్రి కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్ర్యోద్యమ నేపధ్యం లేనప్పటికీ అతను చదివే హరిష్ చంద్ర హైస్కూల్ లోని ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు అతని పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం చేసేవాడు. మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొందిన శాస్త్రి, స్వాతంత్ర్యోద్యమంపై మక్కువ పెంచుకున్నాడు. తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ అంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసాడు. 1921 జనవరిలో అతను 10వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్ లో మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ద్వారా నిర్వహింపబడిన సభకు హాజరైనాడు. మహాత్మా గాంధీ పిలువుకు ప్రేరణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రెండవరోజే శాస్త్రి హరీష్ చంద్ర పాఠశాలను వదలి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరాడు. అతను చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. ఈ కారణంగా అతనిని అరెస్టు చేసారు కానీ మైనర్ అయినందువలన వెంటనే విడిచిపెట్టారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోని అధ్యాపకునిగా పనిచేసిన జె.బి.కృపాలానీ శాస్త్రికి సూపర్‌వైజర్ గా ఉండేవాడు. కృపాలానీ భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీని అనుసరిస్తూ ఉన్న ప్రముఖ నాయకులలో ఒకడు. స్వాతంత్ర్యోద్యమంలోకి చదువును వదిలి వచ్చిన యువ కార్యకర్తలు తమ విద్యను కొనసాగించడానికి కృపాలానీ తన స్నేహితుడు వి.ఎన్.శర్మతో కలసి అనియత పాఠశాలను స్థాపించి యువకులు వారి జాతీయ వారసత్వాన్ని కొనసాగించడానికి "జాతీయ వాద విద్య" ను బోధించేవారు. ఒక సంపన్న పరోపకారం గల వ్యక్తి, కాంగ్రెస్ జాతీయవాది అయిన శివప్రసాద్ గుప్తా మద్దతుతో 1921 ఫిబ్రవరి 10 న బెనారస్ లో ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్) స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడినది. 1925 లో ఈ విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో శాస్త్రి తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతనికి "శాస్త్రి" (పండితుడు) అనే బిరుదునిచ్చారు. ఈ బిరుదును బ్యాచిలర్స్ డిగ్రీ అందజేసే విద్యాపీఠ్ ఇస్తుంది కానీ ఇది అతని పేరులో స్థిరపడిపోయింది. లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ (లోక్ సేవక్ మండల్) లో జీవితకాల సభ్యత్వం తీసుకున్నాడు. అతను ముజఫర్ పూర్ లో గాంధీజీ అధ్వర్యంలో హరిజనుల మంచి కోస్ం వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. తరువాత అతను ఆ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసాడు. శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు. 1940 లో అతను స్వాతత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు. 1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్ం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ ముంబై లోని గోవిలియా టాంక్ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చాడు. శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమయ్యాడు. జవహర్ లాల్ నెహ్రూ గృహమైన ఆనందభవన్‌లో ఉన్న స్వాతంత్ర్య ఉద్యమకారులకు సూచనలను ఒక వారంపాటు పంపాడు. కొద్ది రోజుల తరువాత అతను అరెస్టు కాబడి 1946 వరకు జైలు శిక్ష అనుభవించాడు. శాస్త్రి స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. అతను జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపాడు. పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నాడు.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. పోలీసు శాఖా మంత్రిగా అతను పోలీసులు ఎక్కువగా ఉన్న జన సమూహాలను పారద్రోలేటందుకు లాఠీ చార్జ్ కు బదులుగా వాటర్ జెట్ లు వాడాలని ఆదేశించాడు. పోలీసు మంత్రిగా (తరువాత కాలంలో 1950 నుండి హోం మంత్రి) ఆయన పదవీకాలంలో 1947 లో శరణార్థుల వలసలు, పునరావాసం లో జరిగిన మత సంఘర్షణలను విజయవంతంగా అణచివేసాడు.
1951లో శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించాడు. అతని మంత్రివర్గంలో రతిలాల్ ప్రేం చంద్ మెహ్తా వంటి ఉత్తమమైన భారతీయ వ్యాపారవేత్తలు ఉండేవారు. అతను 1952, 1957, 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలోముఖ్య పాత్ర పోషించాడు. 1952 లో ఉత్తర ప్రదేశ్ లోని సోరాన్ ఉత్తర (ఫూల్పూర్ పశ్చిమ) విధాన సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ హోం మంత్రిగా పదవినలంకరిస్తాడని నమ్మాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్రానికి వెళ్లాడు. నెహ్రూ అతనికి 1952 మే 13 న తన మొదటి కేబినెట్ లో రైల్వే మంత్రి భాద్యతలను అప్పగించాడు. 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.
1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి. అవి:
" చరిత్ర కూడలిలో నిలబడి ఎటు వెళ్ళాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రతి దేశానికీ వస్తుంది. కానీ మనకు ఏ కష్టమూ, సంశయమూ అవసరం లేదు. కుడి, ఎడమలకు చూడనవసరం లేదు. మన మార్గం నేరుగానూ స్పష్టంగానూ ఉంది- అందరికీ స్వాతంత్ర్యం, సంపదా ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, ప్రపంచ శాంతి కోసం పాటుబడడం, అన్ని దేశాల తోటీ మైత్రి నెరపడం" జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులను శాస్త్రి కొనసాగించాడు. టి.టి కృష్ణమాచారిని ఆర్థిక మంత్రిగా నియమించాడు. యశ్వంతరావ్ చవాన్ కు రక్షణశాఖను అప్పగించాడు. అతను స్వరన్ సింగ్ ను విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించాడు. అతను జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి సమాచార ప్రసారాల శాఖా మంత్రిత్వ శాఖను, గుల్జారీలాల్ నందాకు హోం శాఖను అప్పగించాడు. పరిపాలనా కాలంలో 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. భారతీయ ప్రభుత్వం చాలా కాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది. పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్త్రి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చాడు. ఈ సందర్భంలో జరిగిన విద్యార్ధి ఆందోళనలు, శాస్త్రి హామీ తరువాత సద్దుమణిగాయి.

కేంద్ర ప్రణాళికతో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్ర్తి నిలిపివేశాడు. అతను వైట్ విప్లవాన్ని(వైట్ రివల్యూషన్) ప్రోత్సహించాడు. ఈ వైట్ విప్లవం ముఖ్య ఉద్దేశ్యం పాలు ఉత్పత్తి, సరఫరా పెంచడానికి ఒక జాతీయ ప్రచారం చేయడం. గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతంలో ఉన్న అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సహకారంతో "నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు" ఏర్పాటు చేయడమైంది. 1964 అక్టోబరు 31 న అతను గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతాన్ని సందర్శించి కంజరి వద్ద ఏర్పాటు చేసిన అముల్ పశుగ్రాస ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసాడు. ఈ కో-ఆపరేటివ్ విజయాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి కలిగిన అతను ఒక గ్రామంలో రైతులతో రాత్రిపూట బస చేసి ఒక రైతు కుటుంబముతో విందు కూడా చేసాడు. అతను కైరా జిల్లా కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తుల యూనియన్ లిమిటెడ్ (అమూల్) జనరల్ మేనేజర్ అయిన వర్ఘీస్ కురియన్ తో ఈ విషయంలో చర్చలు జరిపాడు. అతను ఇటువంటి నమూనాలను దేశంలో రైతుల సాంఘిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో కూడా నెలకొల్పాలని వర్ఘీస్ కురియన్ తో చర్చించాడు. ఈ సందర్శన ఫలితంగా 1965 లో ఆనంద్ వద్ద నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు స్థాపించబడింది. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక భోజనాన్ని ఇవ్వాలని కోరాడు. దీని ఫలితంగా ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుందని తెలియజేసాడు. అయితే దేశానికి విజ్ఞప్తి చేసే ముందు అతను మొదట తన సొంత కుటుంబంలో ఈ వ్యవస్థను అమలు చేసి ధృవీకరించాడు. ఒక వారంలో ఒక భోజనాన్ని వదిలివేసే అభ్యర్థనను ప్రజలకు తెలియజేయడానికి అతను దేశమంతా పర్యటించాడు. అతని విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసివేయబడినవి. దేశంలోని అనేక ప్రాంతాలు "శాస్త్రి వ్రత్" ను పరిశీలించారు. న్యూఢిల్లీ లోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించాడు. 1965 అక్టోబరు 19 న పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో 22వ రోజున అతను అలహాబాదులోని ఉర్వా లో ప్రభావశీలమైన "జై జవాన్ జై కిసాన్" (సైనికులకు అభినందనలు, రైతులకు అభినందనలు) నినాదాన్నిచ్చాడు. అతి తరువాత జాతీయ నినాదమైనది. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) అతను బాటలు వేసాడు. అతను సామ్యవాది అయినప్పటికీ, భారతదేశం క్రమమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండరాదని పేర్కొన్నాడు.
1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం అద్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినది. తరువాత నేషనల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బోర్డ్ చట్టం కూడా ఏర్పడినది.
శాస్త్రి నెహ్రూ విధానాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు సోవియట్ యూనియన్ తో మరింత దగ్గరి సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత, చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్, పాకిస్తాన్ మధ్య సంబంధాల కోసం సైనిక ఏర్పాటు కోసం భారతదేశ సైనిక దళాల రక్షణ బడ్జెట్‌ను విస్తరించాలని శాస్త్రి ప్రభుత్వం నిర్ణయించింది.
1964లో సిలోన్ లోని భారతీయ తమిళుల హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తో జరిగిన ఒప్పందంపై సంతకం చేసాడు. ఈ ఒప్పందాన్ని "సిరిమా-శాస్త్రి ఒడంబడిక" గా వ్యవహరిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం, 600,000 మంది భారతీయ తమిళులను తిరిగి స్వదేశానికి పంపించగా, 375,000 మంది శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ పరిష్కారం 31 అక్టోబరు 1981 నాటికి జరిగింది. అయితే, శాస్త్రి మరణం తరువాత, 1981 నాటికి, భారతదేశం 300,000 తమిళులను మాత్రమే స్వదేశంలోకి తీసుకున్నారు. శ్రీలంక పౌరసత్వాన్ని 185,000 పౌరులకు (1964 తరువాత మరో 62,000 మంది జన్మించారు) మాత్రమే ఇచ్చింది. తరువాత, భారతదేశం పౌరసత్వం కోసం ఏ ఇతర దరఖాస్తులను పరిగణించకుండా తిరస్కరించింది, 1964 ఒప్పందం గడిచినట్లు పేర్కొంది. 1962 లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత బర్మాతో భారత్ సంబంధాలు బలహీనపడ్డాయి, 1964 లో అనేక భారతీయ కుటుంబాలను బర్మా చేత స్వదేశానికి పంపించడం జరిగింది. న్యూ డిల్లీలోని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి వస్తున్న పౌరులను తిరిగి బదిలీచేసే మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ, బర్మా నుండి తిరిగి వచ్చిన భారతీయుల గుర్తింపు, రవాణా కొరకు ఏర్పాటు చేసింది. ఇది భారతీయ నేల మీద నిరాశకు గురైనవారికి ఆశ్రయం కల్పించడానికి, తగిన సౌకర్యాలను అందించడానికి స్థానిక ప్రభుత్వాల బాధ్యతలకు లోబడి ఉంది. ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి, మింజుర్ కె.భక్తవత్సలం, తిరిగి వచ్చిన వారిని పునరావాసం చేయటంలో శ్రద్ధ చూపించాడు. 1965 డిసెబరులో బర్మాలోని రంగూన్ కు తన కుటుంబంతో పాటు అధికారికంగా పర్యటించాడు. జనరల్ "నె విన్" సైనిక ప్రభుత్వంతో సహజమైన సంబంధాలను తిరిగి పునఃస్థాపించాడు. 1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది. కాశ్మీర్‌లోకి దొంగచాటుగా సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ అమెరికా రాయబారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్‌పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస చేసిన తీర్మానాన్ని అనుసరించి జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని అమెరికా, ఐరాసను కోరింది.
అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమేలేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. దాంతో పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ పాటించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు దౌత్యపత్రాల ద్వారా తెలిసింది.
శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవీ కాలంలో రష్యా, యుగోస్లేవియా, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్టు, బర్మా దేశాలను సందర్శించాడు. అతను కైరోలో జరిగిన అహింసా సమావేశం నుండి తిరిగి వచ్చినపుడు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ తనను విందు కోరకు ఆహ్వానించినపుడు అతను కరాచీ విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయూబ్ ఖాన్ వ్యక్తిగతంగా ఆహ్వానించకపోవడంతో కొన్ని గంటలపాటు నిరీక్షించాడు.
1965 లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్ ఖాన్ తాష్కెంట్ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దీనిని అలెక్సీ కోసైజిన్ నిర్వహించాడు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మృతిచెందాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)