గత ఏడాది కాలంగా సలసల మండిపోతున్న వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో హోల్సేల్ మార్కెట్లో వివిధ రకాల వంట నూనెల ధరలు కొద్ది మేరకు తగ్గాయి. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను కేంద్రం వెల్లడించింది. హోల్సేల్ మార్కెట్లో పామ్ ఆయిల్ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది. సీసమ్ ఆయిల్ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 23,500లకు చేరుకుంది కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 17,100లుగా ఉంది సన్ఫ్లవర్ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది. అంతకు ముందు ఈ ధర రూ.16,176. వేరుశెనగ నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్ సేల్ మార్కెట్లో టన్ను నూనె ధర 16,839గా ట్రేడ్ అవుతోంది. వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది.
గతేడాదితో పోలిస్తే ...!
వంట నూనె ధరల్లో తగ్గుదల నమోదైనా గతేడాది ఇదే సమయానికి నమోదైన ధరలతో పోల్చితే ఇంకా అధికంగానే ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది.