ఆరు నెలల్లో అన్నీ చేసి చూపిస్తా...!

Telugu Lo Computer
0


మరికొన్ని రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల ప్రచారంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ చురుగ్గా ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు 100 మంది సినీ కళాకారులతో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ భేటీ అయ్యింది. 'మా' అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రకాశ్‌రాజ్‌ చర్చించారు. కళాకారుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా తన ప్యానల్‌ కనుక గెలిస్తే 'మా' సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తానని అన్నారు. అసోసియేషన్‌లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని.. కొంతమంది హీరోలు సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యం కోసం కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కేవలం 6 నెలల్లోనే తన పనితనాన్ని చూపిస్తానని అన్నారు. 'మా' మసకబారడానికి కొందరు మాత్రమే కారణమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది 'మా' ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బలంగా పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మొన్నటివరకూ ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా ఉన్న బండ్లగణేశ్‌ ఆ ప్యానల్‌ నుంచి వైదొలగారు. జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఆయన జీవితపై పోటీ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)