బ్లాక్ డే నిర్వహించిన అకాలీదళ్
September 17, 2021
0
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఆమోదించి సరిగ్గా ఏడాది గడవడంతో పార్లమెంట్ ఎదుట శిరోమణి అకాలీదళ్ నేతలు ఆందోళనలు చేపట్టారు. సెప్టెంబర్ 17న చట్టాలు ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ రోజున అకాలీదళ్ బ్లాక్ డేగా పాటిస్తోంది. పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టిన అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, హర్ష్ సిమ్రత్ కౌర్ బాదల్, మరో 13 మంది అకాలీదళ్ నేతలను శుక్రవారం స్వచ్ఛందంగా అరెస్టు అయ్యారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోకి ప్రవేశించే సరిహద్దులను మూసివేసి, ఢిల్లీకి ఎంట్రీ పాయింట్, పార్లమెంట్కు వెళ్లే రహదారులపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ డే నిర్వహించేందుకు గురువారం రాత్రి నుండే అకాలీదళ్ నేతలు భారీగా ఢిల్లీకి చేరుకున్నారు. ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసిపుచ్చి ముందుకొస్తున్న శిరోమణి అకాలీదళ్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రారంభించిన '100రోజుల గల్ పంజాబ్ది యాత్ర'ను వ్యతిరేకించిన రైతుల మద్దతు కూడగట్టేందుకు అకాలీదళ్ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అకాలీదళ్ నేతలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా మాట్లాడుతూ.. ఢిల్లీలో అప్రకటి ఎమర్జెన్సీ ఉందని అన్నారు. అకాలీదళ్ నేతలు శాంతియుత మార్చ్ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారని, అటువంటి మార్చ్ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పార్టీ యూత్ చీఫ్ పరంబన్స్ సింగ్ రోమన అన్నారు. మొత్తంగా దేశరాజధానిలోని ఏడు ప్రాంతాల్లో తమ నేతలు ధర్నాలో కూర్చున్నారని చెప్పారు.