ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం. ఆధునిక భారతదేశంలోని తొలి నగరం ఇదే. చెన్నై నగరం మొట్టమొదట "చెన్నప్ప నాయకన్"గా అని తర్వాత కాలక్రమంలో అది చెన్నపట్నంగా, మద్రాస్గా మారి నేడు చెన్నై అనే పేరుతో స్థిరపడింది.
చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి 382 వసంతాలు పూర్తి చేసుకొంది. 22-08-1639లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది.