అఫ్గానిస్థాన్‌ లో దుర్భర స్థితి!

Telugu Lo Computer
0


అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనను తట్టుకునే ఓపిక లేక ఎలాగైనా దేశం దాటి వెళ్లిపోతున్నారు. వేల మంది ఇప్పటికే పలు దేశాలకు తరలిపోయారు. ఇంకా అనేక మంది కాబూల్‌ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రజలు ముగురు కాలువలోకి దిగి అమెరికా సైనికులను అభ్యర్థిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దాదాపు 4వేల మంది అమెరికా సైనికులు కాబూల్‌ విమానాశ్రయం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు ఉంటేనే విమానాశ్రయం లోపలికి అనుమతిస్తున్నారు. అయితే విమానాల రాకపోకలు పరిమితం కావడంతో వేల మంది ఎయిర్‌పోర్టు బయటే ఉండి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని విమానాశ్రయం లోపలికి అనుమతించాలని అమెరికా సైనికులను కోరుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ గోడకు సమీపంలో ఉన్న మురుగు నీటి కాలువలోకి దిగి అనేక మంది అఫ్గాన్లు తమ వద్ద ఉన్న పత్రాలను చూపిస్తున్న వీడియో అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. అఫ్గాన్‌ పౌరులు స్వదేశాన్ని వీడటాన్ని అడ్డుకుంటామని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. విదేశీ పౌరులపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయానికి వెళ్లే రోడ్లను తాలిబన్లు బ్లాక్‌ చేశారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్న అఫ్గాన్‌ పౌరులు తిరిగి వెనక్కిరావాలని వారికి తాలిబన్ల నుంచి ఎలాంటి హాని ఉండబోదని జబివుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)