హరికథా పితామహ నారాయణదాసు

Telugu Lo Computer
0


ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహు భాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. 1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచారు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవారు. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవారట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు) అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశారట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట. ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు చిన్నవయసులోనే. తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరారు. అంతేగాక నారాయణదాసు ఈసఫ్ కథలను నూఱుగంటి పేరిట అనువదించి వీరేశలింగం ప్రచురణాలయానికి పంపగా, ఆ గ్రంథ ప్రచురణను తొక్కిపట్టి ఆ మార్గంలోనే ఈసఫ్ కథలను తానుకూడా తెనుగు చేసి ముందుగా ప్రకటించారు. అది విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. తర్వాతే నూఱుగంటి వెలుగుచూసింది. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితులు. అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచారు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్టగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడినది. మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాల ను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపారు. కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి. నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చారు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్ధులకు నేర్పారు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించారు. నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవారు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)