కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్ లో మరో టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు లభించిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకా డోసులు ఈ వారంలోనే భారత్ కు చేరనున్నాయి. జూలై 15 నుంచి పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మోడెర్నా టీకా దిగుమతుల కోసం దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు డీసీజీఐ గత వారం అనుమతులు మంజూరు చేసింది. టీకా పంపిణీ చేపట్టిన తరువాత తొలి వంద లబ్ధిదారులకు సంబంధించిన ఏడు రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ డీసీజీఐకి సమర్పించానే షరతుతో అనుమతించింది.