కరోనా నివారణలో టీకానే అస్త్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసింది. ప్రజలలో వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచడంతో పాటు 45 ఏళ్లు పైబడిన వారిని వ్యాక్సినేషన్ కు మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా పోలింగ్ స్టేషన్ల వద్దె టీకా అందించే కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలు ఎక్కడైతే ఓట్లు వేశారో, అవే బూత్ల్లో టీకా తీసుకోవచ్చని తెలిపారు.
‘నేటి నుంచి జహా ఓట్, వహాన్ వ్యాక్సినేషన్ (ఎక్కడ ఓటేస్తే, అక్కడే వ్యాక్సినేషన్) అనే క్యాంపెయిన్ను మొదలు పెడుతున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రజలు తాము ఓటేసిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లి అక్కడే టీకాను తీసుకోవాలి.
త్వరలోనే ఇంటింటికీ టీకా (డోర్ టు డోర్ వ్యాక్సినేషన్)ను ప్రారంభిస్తామని, వచ్చే నాలుగు వారాల్లో 45 ఏళ్లకు పైబడిన వయస్సు వారికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించామన్నారు.
వీళ్లు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి ప్రజలకు ఫస్ట్ డోస్ ఇచ్చేందుకు అవసరమైన స్లాట్ను బుకింగ్ చేస్తారని వివరించారు.