కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమ్మకాల క్షీణతను అధిగమించేందుకు మహీంద్రా సంస్థ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు వాహనాలు కొంటే, మూడ్నెల్ల తర్వాత ఈఎంఐలు కట్టుకోవచ్చంటూ ప్రజలను ఊరిస్తోంది. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మహీంద్రా వాహనాన్ని ఇప్పటికిప్పుడే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. కొనుగోలు సమయంలో ఈఎంఐ చెల్లించాల్సిన పనిలేదని, మూడ్నెల్ల తర్వాత మొదటి ఈఎంఐ చెల్లించవచ్చంటూ తన ఆఫర్ ను వివరించింది.
అంతేకాదు, కొనుగోలుదారులను ఆకర్షించేలా తన 'ఓన్ లైన్' ప్లాట్ ఫామ్ ద్వారా రుణ సదుపాయం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రూ.3 వేల విలువైన యాక్సెసరీస్, లోన్ సమయంలో రూ.2 వేల విలువైన బెనిఫిట్స్... ఇలా అనేక ఆఫర్లు ప్రకటించింది. వాహనానికి సంబంధించిన వారెంటీ పొడిగింపు, యాక్సెసరీస్ వ్యయం, వర్క్ షాపు చార్జీలు వంటి ఇతర చెల్లింపులను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. ఇక 7.25 శాతం వడ్డీ రేటుకే వాహన రుణాలను ఇస్తోంది. 100శాతం ఆన్ రోడ్ ఫండింగ్ సమకూరుస్తోంది. ముందస్తుగా ముగించే రుణాలపై ఎటువంటి అదనపు ఛార్జి వసూలు చేయడంలేదు. యాక్సెసిరీస్, ఎక్స్టెండెడ్ వారెంటీలపై కూడా రుణాలు మంజూరు చేస్తోంది. రూ.లక్షకు 799 ఈఎంఐ చొప్పున అత్యధికంగా 8 ఏళ్ల కాలవ్యవధితో రుణాలు ఇస్తోంది.