ఇప్పటి వరకు మల్టీ షాపింగ్ స్టోర్స్, రెస్టారెంట్లు, షాపులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాల గురించి ప్రతి ఒక్కరూ విన్నారు. ఎందువల్ల అంటే గతంలో ఎవరికి వారికి సొంతంగా ఇళ్లు అనేది ఉండేది. కానీ పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా బహుళ అంతస్తుల్లో మనిషి నివాసం ఉండటానికి అలవాటు పడ్డాడు. ఇప్పటి వరకు రకరకాలైన విధాలుగా బహుళ అంతస్తులను వినియోగించాడు మానవుడు. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చినా, కొందరు ఇంటిలోనే చిన్నచిన్న పూల చెట్లు, హైబ్రీడ్ వంగడాలను పండించారు. కానీ, అమెరికా శాస్త్రవేత్తలు ఎప్పుడో ఎనిమిదో శతాబ్ధంలో ఉన్నటువంటి వేలాడే ఉద్యానవనాలను పోలిన బహుళ అంతస్తుల్లో వ్యవసాయం ప్రారంభించారు. ఈ రకమైన వ్యవసాయాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 30 అంతస్తుల గాజు భవనంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు కూడా. అమెరికాలోని మన్హట్టన్ యూనివర్శిటీ, ఎన్విరాల్మెంట్ హెల్త్ సైన్స్ ఆఫ్ కొలంబియా యూనివర్శిటీశాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ కొత్త తరహా వ్యవసాయసాగు పద్థతిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఎన్నో ఉపయోగాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రధానంగా రైతు పండించిన పంటను తరలించటానికి (ట్రాన్స్పోర్ట్) ఖర్చు ఉండదని, పంట దిగుబడిలో నూటికి నూరుశాతం ఫలితాలు వస్తాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ల్లోనే ఇటువంటి విధానాలు అవలంబించినా, అవి పాక్షికంగానే విజయవంతం అయ్యాయి. తొలిసారిగా ఇంత భారీస్థాయిలో విజయవంతం అవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
సమాంతర వ్యవసాయం వల్ల రైతుకు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమీ ఉండవని కొలంబియా యూనివర్శిటీ ఫ్రొఫెసర్ డెక్సన్ డిస్మాపియర్ వెల్లడించారు. ఈ వ్యవసాయ విధానం గురించి ఆయన మాట్లాడుతూ - ఈ విధానం వల్ల భవిష్యత్లో ఏదైన ఉపద్రవాలు, అణు యుద్ధాలు వచ్చినా ఆహార ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు. మొదట్లో 30 అంతస్తుల్లో వ్యవసాయం అనేది కార్యాచరణ ఆచరణసాధ్యమా కాదా అని సందేహాలు ఉన్నా, ప్రాజెక్ట్ విజయవంతం కావటంతో ఆకాశమే హద్దుగా మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే..కాలంతో సంబంధం లేకుండా పంటలను దీంట్లో పండించవచ్చు. అన్ని రకాలైన వంగడాలను ఈ బహుళ అంతస్తుల్లో వేయవచ్చు. కాలంతో పాటు బరువు పెరిగే ఈ పంటలను తట్టుకునే విధంగా బిల్డింగ్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఫ్రొఫెసర్.డెక్సన్ మరింత సమాచారం వెల్లడిస్తూ...ఈ విధానంలో ప్రతి అపార్ట్మెంట్లో ఏ పంటకా పంటను పండించవచ్చునని, ఇండోర్ఫీల్డ్స్ను ఏర్పాటు చేయటం ద్వారా సులభంగా పంటను పండించవచ్చు అంటున్నారు. దీనికి అవసరమైనటువంటి నీటిని స్ప్రింక్ (బిందు సేద్య) విధానం ద్వారా అందజేయటం వల్ల పంటకు అవసరమైన నీరు అందుతుందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విండోల ద్వారా గాలిని అందించటం జరుగుతుందని, పంట నుంచి విడుదలయ్యే వాయువులను బయట వాతావరణంలోకి వెళ్లటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. దీనివల్ల హానికరమైన విషవాయువులు ఏమైనే ఉత్పత్తి అయితే వెంటనే తెలియజేయటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. విషవాయువులు విడుదల అయిన వెంటనే అలారమ్ మోగుతుంది. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ప్రత్యేకించి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఆకాశంలో చుక్కలు తాకుతున్న కూరగాయల ధరలను ఈ వ్యవసాయ పద్ధతులను వల్ల అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు అంటున్నారు. అంతేగాక, గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించవచ్చునని తెలిపారు. ఈ వ్యవసాయం విధానంలో వ్యర్థం అంటూ ఏమీ ఉండదని తెలుపుతున్నారు. ప్రతి పదార్ధము రీసైక్లింగ్ చేయవచ్చు. ఇప్పటికే 18వేల ఆపిల్ కాయలను పండించటం జరిగిందని తెలిపారు. దీన్ని ఆధునిక ఫ్యాన్సీ గ్రీన్హౌస్గా అభిర్ణిస్తున్నారు. చివరిగా ఫ్రొఫెసర్ డెక్సన్ మాట్లాడుతూ ఏమో..! రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అని ఆయన అంటున్నారు.
ఉపయోగాలు:
ఈ రకమైన వ్యవసాయం వల్ల సంవత్సరం పొడవునా పంట పండించవచ్చు.
తక్కువ నిర్వహణ వ్యయం.
ఇతర రసాయనాల వాడకం తక్కువ, అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటుంది.
నిరర్థక పదార్ధాలను రీసైక్లింగ్ చేయగలదు.
దీనివల్ల గ్రామీణ వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలు.పంటకు వాడగా, మిగిలిన నీటి వనరులను తిరిగి వినియోగించుకునే సౌకర్యం, అవసరమైతే మంచినీటిగానూ మార్చవచ్చు. సరైన నిష్పత్తిలో పోషకపదార్థాలను అందజేయవచ్చు.దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.వ్యవసాయంలో సహజంగా ఉండే ఇబ్బందులును చాలా వరకు అధిగమించవచ్చు.ఎకో ఫ్రెండ్లీగా ఈ విధానం ఉండటం ఫలితంగా సహజవనరులకు ఎటువంటి నష్టం జరగదు.
ఈథైన్ గ్యాస్ జనరేషన్ను అదుపులో ఉంచుతుంది.