సంచయిత నియామకం జీవో కొట్టివేత

Telugu Lo Computer
0


మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవుల నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద్ గజపతి కుమార్తె సంచయితను ప్రభుత్వం గతేడాది నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. తిరిగి అశోక్ గజపతిరాజును ఈ రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించిన కోర్టు.. సంచయిత నియామకాన్ని రద్దుచేసింది.

ఛైర్మన్‌గా తొలగింపు సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మర్నాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడంతో వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని, ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టుల ఛైర్మ‌న్‌ను నియ‌మించింద‌ని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం, అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా తిరిగి నియ‌మించాల‌ని సోమవారం ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని మాన్సాస్ ట్రస్ట్ విషయంతో రుజువైందన్నారు. వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచిందని, ఎక్కడెక్కడ శాశ్వత నష్టాలు జరిగాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. సింహచలం దేవస్థానం గోశాలలో గోవుల చనిపోయాయని, వాటిని సంరంక్షించాల్సింది పోయి హింసించి చంపారన్నారు.

కాగా, అశోక్ గజపతి రాజుపై సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాన్సాస్ చైర్మన్‌గా, సింహాచల దేవస్ధానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగే అర్హత అశోక్ గజపతిరాజుకే ఉందని ప్రకటించటంతో, న్యాయం గెలిచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)