ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. తాజాగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా పరీక్షలు రాయవచ్చని బోర్డు పేర్కొంది. అలాగే సప్లీ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయగోరే విద్యార్ధులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సప్లీ ఎగ్జాం ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో మార్కులు ఆశించిన వాటి కంటే తక్కువగా వచ్చిన విద్యార్ధులు ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. కాగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 4,99,756 మంది, సెకండ్ ఇయర్‌లో 5,02,394 మంది, ప్రైవేట్‌లో సెకండ్‌ ఇయర్‌ 76,298 మంది కలిపి మొత్తం 10,02,150 మంది ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)