భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆరు కిలోల వెండి ఇటుక కనిపించడం లేదన్న అంశంపై దృష్టి సారించామని ఈఓ రమాదేవి అన్నారు. కనుగొనేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి అంజనీదేవి తనిఖీ చేస్తున్నారని, ఆ నివేదిక అందించాక లెక్కల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ఒక వేళ వెండి ఇటుక జాడ లేనట్లయితే సంబంధిత సిబ్బంది నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత నివేదిక ప్రకారం 67.774 కిలోల బంగారం, 980.68 కిలోల వెండి ఉందని వివరించారు. 2009 తర్వాత ఇప్పుడే పూర్తి స్థాయి తనిఖీ కొనసాగుతోందని, ఇది పూర్తయితే ఆభరణాల బాధ్యతలు తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. వృథాగా ఉన్న వెండిని బంగారం బాండ్లుగా మార్చి బ్యాంకులో జమచేస్తామని తెలిపారు. 10 కిలోల బంగారానికి సరిపడా వెండిని అందించి ప్రభుత్వ రంగ సంస్థ మింట్ సహకారంతో ఈ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగల మ్యూజియంతో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగించే బంగారమే ఆలయంలో ఉందని మిగతాది బ్యాంకు లాకర్లలో ఉన్నట్లు తెలిపారు. వెండి మాత్రం బ్యాంకులో కాకుండా ఆలయంలోనే ఉందని చెప్పారు. స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేసి దానిని బ్యాంకు లాకర్ తరహాలో ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. రూ.80 కోట్లకు పైగా ఆడిట్ అభ్యంతరాలు ఉంటే అందులో రూ.33.5కోట్లకు రసీదులు ఉన్నాయని తెలిపారు. కొవిడ్ తరుణంలో దేవస్థానానికి సంబంధించిన రూ.5 కోట్ల డిపాజిట్లను ఉద్యోగుల జీతభత్యాలు, ఆలయ నిర్వహణకు ఉపయోగించామని చెప్పారు. భక్తుల రద్దీతో ఆదాయం పెరగడం వల్ల రూ.2 కోట్లను తిరిగి డిపాజిట్ చేశామని, శ్రీరామనవమి తర్వాత మిగతాదీ డిపాజిట్ చేస్తామని వివరించారు. బంగారం, వెండి, నగదు లావాదేవీల్లో తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
వెండి ఇటుక లెక్క తేల్చుతాం !
February 17, 2024
0
Tags