ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఇస్తోన్న 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని కొనసాగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ప్రతి ఇంటికి తాగు నీరు, సౌరశక్తితో ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రాజ్య సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ ఈ ప్రకటన చేశారు. ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో కొనసాగిస్తామని తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఎప్పటికీ ఉంటుందని, ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగుతోందని ప్రకటించారు. కాగా, కరోనా మహ్మమారి సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద దేశంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా నెలకు 5 కిలోల రేషన్ బియ్యం అందించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందారు. కరోనా సమయంలో తీసుకువచ్చిన ఈ స్కీమ్ గడువు గతేడాది నవంబర్తో ముగిసింది. దీంతో ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పెంచుతూ నవంబర్లో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ స్కీమ్ కింద 2024 జనవరి నుండి 2028 వరకు కేంద్రం ఉచితంగా నెలకు 5 కిలోల రేషన్ అందించనుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు.
ఉచిత రేషన్ బియ్యం పథకం కొనసాగిస్తామన్న ప్రధాని !
February 07, 2024
0
Tags