ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను తన క్యాబ్లో ఎక్కించుకున్నాడు. అయితే, మరో వ్యక్తి కోసం మెహ్రోలీ ప్రాంతానికి బయలుదేరాడు. అప్పడు రాత్రి 8.40 గంటలు అయ్యింది. ఆ సమయంలో నగరమంతా పూర్తి ట్రాఫిక్తో నిండి ఉంది. ఆ ట్రాఫిక్లో మనోజ్ కారు కూడా చిక్కుకుని ఉంది. అదే సమయంలో బైక్పై వెళ్తున్న మరో ముగ్గురు వ్యక్తులు మనోజ్ను ఓవర్ టేక్ కోసం దారి ఇవ్వమని అడిగారు. అయితే ఆ ట్రాఫిక్లో బైక్ వెళ్లేంత గ్యాప్ లేకపోవడంతో మనోజ్ దారి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు మనోజ్తో గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదిగా మారింది. దాంతో ఆ ముగ్గురి వ్యక్తుల్లో ఓ వ్యక్తి కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి బైక్పై పారిపోయారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్ మనోజ్ను అక్కడ ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే మనోజ్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మైనర్ అయిన ఒక నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు . మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దారి ఇవ్వలేదని డ్రైవర్పై కత్తితో దాడి !
December 29, 2023
0
Tags