లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ అధికారికంగా అడిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హఫీజ్ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. 2008 నవంబరు 26న దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్పై ఎన్నో కేసులు ఉన్నాయి. ముంబయి పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అతడిని తమకు అప్పగించాలని భారత్ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. కానీ, భారత్-పాక్ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది. కాగా.. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో హఫీజ్ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడింది.
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని అప్పగించండి !
December 28, 2023
0
Tags