ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం ఆపరేషన్ విజయవంతం అయ్యింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రెస్క్యూ టీం మంగళవారం సురక్షితంగా బయటకు తెచ్చింది. పాక్షికంగా కూలిపోయిన టన్నెల్లో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉండగా, వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 17 రోజులపాటు నిర్మిరామంగా కృషి చేసి బయటకు తెచ్చిన బలగాలపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వీడియో సందేశం ఎక్స్లో ఉంచారు. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారులు.. చివరకు రాట్హోల్ మైనింగ్ టెక్నిక్తో విజయం సాధించారు. మంగళవారం సాయంత్రం ఐదుగురు సభ్యుల బృందం ప్రత్యేక పైప్ ద్వారా లోపలికి వెళ్లి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చింది. గంటపాటు కొనసాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్ వీకే సింగ్లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది సురక్షితం !
November 28, 2023
0
Tags