ఉత్తరప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో ఓ యువకుడు అభ్యంతరకంగా ప్రవర్తించాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వృద్ధ దంపతులు ఢిల్లీ వెళ్లేందుకు గత బుధవారం సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎక్కారు. వీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తుండగా ఈ జుగుప్సాకర అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఓ యువకుడు.. లోయర్ బెర్త్లో పడుకున్న ఆ దంపతులపై, వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని దిల్లీకి చెందిన రితేశ్గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైల్లో వృద్ధ దంపతులపై మూత్రవిసర్జన చేసిన యువకుడు !
October 06, 2023
0
Tags