రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలపై సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్‌

Telugu Lo Computer
0


బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపాయి. డానిష్ అలీపై బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై విపక్షాలు ఘాటుగా స్పందించాయి. బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయగా ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ అగ్రనాయకత్వం రమేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు విపక్ష ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సారధ్యంలోని సభా హక్కుల కమిటీకి స్పీకర్ పంపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించడం పట్ల విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల కాషాయ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. రమేష్ బిధూరి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డానిష్ అలీని ఉద్దేశించి ఎవరూ మాట్లాడలేని పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే వ్యక్తిని టోంక్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్‌గా కాషాయ పార్టీ నియమించిందని గుర్తుచేశారు. టోంక్‌లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా ఈ అంశంపై స్పందించారు. సబ్ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్ ఇప్పడు సబ్ హై ఇంకా బక్వాస్ అంటూ ట్వీట్ చేశారు. ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిధూరిని బీజేపీ ప్రమోట్ చేస్తోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర వ్యాఖ్యానించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన వ్యక్తికి ఆ పార్టీ నూతన బాధ్యతలు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)