జమిలి ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమే !

Telugu Lo Computer
0

                                                  

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో నిర్వహించనున్న జమిలి ఎన్నికలంటే రాష్ట్రాలపై దాడితో సమానమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీపై కాంగ్రెస్ అనుమానాలను వ్యక్తం చేసింది. జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు భారత్ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే' రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత్ అంటే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. 'జమిలి ఎన్నికల పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. దేశంలో వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో కలిపి 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగారూ 9,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే అంచనా వేసింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల అనంతరం తిరిగి వాటిని భద్రపరిచేందుకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 2015లోనే న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బందిశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన నివేదికలో ఎన్నికల సంఘం ఈ అంశాలను ప్రస్తావించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)