ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఆదిత్య ఎల్-1 కౌంట్డౌన్ ప్రారంభమైంది. 23 గంటలకు పైగా ఈ కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహ ఆకృతిని తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అటు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. సూళ్లూరుపేటలోని చెంగలమ్మ పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు రేపు ప్రయోగాన్ని వీక్షించొచ్చు.
రేపే నింగిలోకి 'ఆదిత్య ఎల్-1' ప్రయోగం
September 01, 2023
0
Tags