మంత్రులు, వీఐపీల కార్లకు ప్రోటోకాల్లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై సైరన్ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వీఐపీలు వాహనాల్లో లేకపోయినా.. ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు సైరన్ మోగిస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవడంతోపాటు శబ్దకాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, వాహనాల సైరన్ మోతను వినసొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్లతో కలిసి పుణె (Pune)లోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం. వీఐపీ వాహనాలపై ఉండే రెడ్ లైట్ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ కూడా తొలగించాలనుకుంటున్నాం. ఇందుకోసం కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాం. సైరన్కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం'' అని నితిన్ గడ్కరీ తెలిపారు.
సైరన్ స్థానంలో భారతీయ సంగీతం !
August 13, 2023
0
Tags