ఇండియా ఐడియాలజీని రక్షించడమే నా ధేయ్యం !

Telugu Lo Computer
0


మోడీ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన దారిలో అడ్డంకులు ఏమొచ్చినా.. తన కర్తవ్యం ఎప్పటికీ మారదని, ఇండియా ఐడియాలజీని రక్షించడమే తన ధ్యేయమని ట్విటర్ మాధ్యమంగా చెప్పుకొచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది కాబట్టి రాహుల్‌పై ఎంపీగా పడిన అనర్హత వేటు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ వేటు వెంటనే తొలగిపోతే ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లోనే రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. కాగా 2019లో కర్ణాటకలో జరిగిన ఒక ఎన్నికల సభలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా అవుతోంది?' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పూర్ణేశ్ మోడీ అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. దీనిని విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేలుస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద రాహుల్‌పై అనర్హత వేటు పడగా, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అప్పుడు రాహుల్ గాంధీ తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరగా గుజరాత్ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసుని సుప్రీంకోర్టు  విచారించి, వాదోపవాదనల అనంతరం రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)