ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

Telugu Lo Computer
0


తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే, ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి జిల్లాల్లోని లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అందజేయనుంది. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.2 లక్షలు సరిపోవడం లేదనీ, దీనిని పెంచాలని సీఎం కేసీఆర్‌కు అనేక విజ్ఞప్తులు అందాయి. దీంతో సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచాలని వైద్య,ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్‌ నిర్వహించారు. హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావు, వీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పతో పాటు ఇతర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ వైద్యుల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహణ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నది. ఈ తరహా సేవలను ఎంబీఎం వరంగల్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు పెంచింది. వ్యయప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకండా నియోజకవర్గ పరిధిలోనే డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి. మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు గాను అన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి వినియోగించడానికి బోర్డు అనుమతించడం జరిగింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. బయోమెట్రిక్‌ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)