టీఎస్‌పీఎస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రాజకీయ నాయకుల పిల్లలు ?

Telugu Lo Computer
0


టీఎస్‌పీఎస్‌ పేపర్‌ లీకేజీ కేసులో రోజుకో వ్యవహారం బయటపడుతోంది. పేపర్‌ లీకేజీ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న రమేష్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏఈఈ , డీఏఓ పరీక్షల్లో ఇన్విజిలేటర్స్‌తో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ జరిపించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో రాజకీయ నేతల పిల్లల పేర్లు కూడా బయటకొస్తున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధితో రమేష్‌ భారీ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. ఏఈఈ  పేపర్‌ను ఏకంగా రూ. 75 లక్షలకు బేరంపెట్టినట్లు విచారణలో తేలింది. కరీంనగర్‌ జిల్లాలోని బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ కూతురు సైతం ఏఈఈ  పరీక్షకు హాజరైంది. పరీక్షకు ముందు ఈ మాజీ ఎంపీటీసీ రమేష్‌ను కలిసినట్లు అధికారులు తేల్చారు. ఒప్పందం ప్రకారం ఎంపీటీసీ కూతురికి రమేష్‌ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ఇచ్చాడు. పరీక్ష పూర్తయ్యాకే డబ్బులు చెల్లిస్తామని సదరు ప్రజాప్రతినిధి రమేష్‌తో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తేలింది. పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో నాయకుల పిల్లల పేర్లు కూడా తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత రమేష్‌తో పాటు మరో ఎనిమిదిమంది మాస్‌ కాపీయింగ్‌కు స్కెచ్‌ వేశారు. దీనికి అవసరమైన మైక్రో రిసీవర్స్‌, మైక్రో ఇయర్ బడ్స్‌ ఆన్‌లైన్‌లో కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం సేకరించిన డివైజెస్‌తో పలుసార్లు డెమో నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాక.. రమేష్‌ అతని బంధువు పూల రవికిశోర్‌. అభ్యర్ధుల కోసం వెతికాడు. హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్స్‌లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను కలిసి కాపియింగ్ గురించి వివరించారు. వీరిలో ఏఈఈ , డీఏఓ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులను గుర్తించారు. వాళ్లతో మాట్లాడి డీల్‌ సెట్‌ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)