సచివాలయాల్లో 11 రకాల సేవలు ఉచితం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించింది. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. జగనన్న సురక్ష కార్యక్రమం విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సచివాలయాల వారీగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఈ నెల 24 నుంచే ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్క్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, వలంటీర్లకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు),ఆదాయ ధ్రువీకరణ పత్రం , డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌, మరణ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌ (భూకొనుగోలు అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు), మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌ (ఆన్‌లైన్‌లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు) , వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు), ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన వంటి సేవలు సర్వీసు చార్జీలు లేకుండా అందించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)