మోసం చేసిన చంద్రబాబును నమ్మొద్దు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను మహిళలకు అందజేశారు. ఈ ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసి మొత్తం 1,402.58 ఎకరాల్లో 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు. పట్టాలతో పాటుగా సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 25 లే అవుట్లలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మందికి, గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుందని, అందరి అమరావతి అవుతుందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి కొందరు దుర్మార్గులు, మారీచులు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జులై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అమరావతిలో వారం పాటు ఇళ్ల పట్టాల పండగ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి లేఔట్‌ వద్దకు లబ్ధిదారులను తీసుకెళ్లి అక్కడే ఫొటో తీసుకుంటామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు ఆప్షన్లు ఉంటాయని, సొంతగా ఇళ్లు కట్టుకుంటే రూ.లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. అలాగే నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించారు. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్ లు సబ్సిడీపై అందిస్తామని, మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే ఉందన్నారు. బాబు అనుకూల మీడియాకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని, ఇప్పుడు గజ దొంగల ముఠా ఒక్కటవుతుందన్నారు. పెత్తందార్లతో పేదవాడు పోరాటం చేయాల్సి వస్తుందని.. అమరావతిలో పేదవాడు ఉండకూడదని కోర్టులో కేసులు వేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, 30లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించామన్నారు. చంద్రబాబు మాత్రం అన్ని వర్గాలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు. మోసం చేసే చంద్రబాబును నమ్మవద్దన్నారు. నరకాసురిడినైనా నమ్మొచ్చుకానీ నారా చంద్రబాబును నమ్మొద్దని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. దొంగల ముఠా ఏకమై మళ్లీ అధికారంలోకి రావడానికి చూస్తోందని ధ్వజమెత్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)