26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

Telugu Lo Computer
0


ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 1,402 ఎకరాల్లో 51వేలకు పైగా ప్లాట్లను సిద్ధం చేస్తున్నట్లు సీఆర్​డీఏ అధికారులు తెలిపారు దీని కోసం 25 లేఔట్లు సిద్ధం చేశామని, పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751 ఎకరాల్లో 14 లేఔట్లు, గుంటూరు జిల్లాకు కేటాయించిన 650 ఎకరాల్లో 11 లేఔట్లు వేశారు. వాటిలో 51వేల 392 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం భూమి చదును ప్రక్రియ పూర్తయిందని, సరిహద్దు రాళ్ల ఏర్పాటు, ప్లాట్ల నంబరింగ్ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. అమరావతి ప్రాంతంలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం,కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల పరిధిలో ఈ ప్లాట్లు కేటాయిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో బహిరంగసభ ఏర్పాటు చేసి  సీఎం జగన్ చేతుల మీదుగా ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఈ సభ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 50వేల మంది చొప్పున మొత్తం లక్ష మందిని ఈ సభకు తరలించాలని.. అధికార యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో.. ఓవైపు లేఔట్ల అభివృద్ధి పనులు, మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం తలమునకలైంది. రాజధాని కోసం అమరావతి రైతులు.. 39వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. ప్రతిగా వారికి ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది. వాటిని అభివృద్ధి చేసివ్వాలని ఒప్పందంలో ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. అక్కడ కంపచెట్లు పెరిగి.. ఆ ప్రాంతమంతా అడవిలా మారినా.. వాటిని తొలగించలేదు. ప్లాట్ల వద్దకు వెళ్లేందుకు అక్కడ రోడ్డు సౌకర్యం లేదు. కనీసం ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులున్నారు. కాగా తామిచ్చిన భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ప్లాట్ల పంపిణీ ప్రక్రియ రాజధాని రైతుల్లో ఆగ్రహానికి, ఆవేదనకు కారణమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)