దీపక్ సేథి హత్యను ఛేదించిన పోలీసులు

Telugu Lo Computer
0


ఢిల్లీ లాడ్జ్‌లో శవమై కనిపించిన వ్యాపారవేత్త దీపక్ సేథి హత్య కేసుని పోలీసులు ఛేధించారు. హనీ ట్రాప్‌లో అనుకోకుండా ఈ హత్య జరిగిందని తేల్చారు. ఆయన్ను దోచుకోవాలన్న ఉద్దేశంతో హనీ ట్రాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లారని, అక్కడ ఆయనకు ఇచ్చిన మత్తు మందు ఓవర్‌డోస్ కావడంతో మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 29 ఏళ్ల ఉషా అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. తనని తాను అంజలి, నిక్కీ, నికితలతో పాటు మరెన్నో మారు పేర్లతో వ్యాపారవేత్తలతో పరిచయం చేసుకొని, వారిని బుట్టలో పడేసేది. వారిని హోటళ్లకు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి దోచుకునేది. దీపక్ సేథి విషయంలోనూ అదే ప్లాన్‌ని హనీ ట్రాప్ ముఠా రిపీట్ చేసింది. మార్చి 30వ తేదీన రాత్రి 9:30 గంటల సమయంలో ఉషాతో కలిసి దీపక్ సేథి బల్జీత్ లాడ్జ్‌కి వెళ్లారు. రూమ్‌లో కాసేపు గడిపిన ఉషా.. 12:24 గంటల సమయంలో రూ.1100, జ్యువెల్లరీతో బయటకు వచ్చింది. వెళ్తూ వెళ్తూ.. 'సారీ' అంటూ ఒక నోట్ రాసి వెళ్లింది. అదే ఆమెను పట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృతుడి ఫోన్‌ని పరిశీలించారు. అతనికి వచ్చిన ఫోన్ నంబర్లలో.. ప్రధాన నిందితురాలితో సహా కొన్ని అనుమానిత నంబర్లను గుర్తించారు. ఉషా నంబర్ సంత్‌గఢ్‌ ప్రాంతంలో రీఛార్జ్‌ అవ్వడంతో.. ఆ లోకేషన్‌ని ట్రేస్‌ చేసి, అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక నైజీరియన్ వ్యక్తి దొరకడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అతడు సహజీవనం చేస్తున్న మధుమిత స్నేహితురాలే ఉషా అని తేలడంతో.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో ఉషా జైలు శిక్ష కూడా అనుభవించిందని.. అక్కడే ఆమెకు మధుమితతో ‍పరిచయం ఏర్పడిందని తెలిసింది. మధుమితనే దీపక్‌ సేథీని ఉషాకు పరిచయం చేసినట్లు పోలీసులు వివరించారు. దీపక్ సేథి ఒక పెద్ద వ్యాపారవేత్త కావడంతో.. అతడ్ని హనీ ట్రాప్ చేసి దోచుకోవాలని ఉషా ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అతడ్ని చంపే ఉద్దేశం తనకు లేదని, కేవలం మత్తు మందు ఇచ్చి, అతడ్ని దోచుకోవాలని అనుకున్నానని పోలీసుల విచారణలో ఉషా తెలిపింది. అయితే.. తానిచ్చిన మత్తు మందు ఓవర్‌డోస్ అవ్వడం వల్ల అతడు చనిపోయాడని తెలిపింది. అందుకే.. లాడ్జ్ గది నుంచి బయటకు వెళ్లే ముందు 'సారీ' నోట్ వదిలి వెళ్లినట్టు ఆమె తెలిపింది. అలాగే.. సేథీ నుంచి ఆమె తీసుకున్న మొబైల్‌ ఫోన్‌, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)