తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఉదయం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సప్లల్లో చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఏడు నిమిషాల్లోపే ఈ ప్రశ్నాపత్రం వాట్సప్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ పేపర్ లీక్ చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బందెప్ప మొబైల్ ఫోన్ నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. బందెప్పతో పాటు తాండూరు మండల విద్యాశాఖాధికారి వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదంటూ వికారాబాద్ డీఈఓ వివరణ ఇస్తోన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నాపత్రం, విద్యార్థులకు ఇచ్చినది రెండూ ఒక్కటేనని పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు బందెప్ప, వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గకముందే ఇప్పుడు మళ్లీ ఎస్ఎస్సీ పరీక్ష పత్రం కూడా లీక్ కావడం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు సైతం దీనిపై మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. సమగ్ర నివేదిక అందజేయాలంటూ వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ?
April 03, 2023
0
Tags