విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పునరుద్ఘాటించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన తండ్రి బర్నబాస్ను కలిసేందుకు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద స్థానికులను పలకరించి వారితో మాట్లాడారు. 'బిడ్ వేసేందుకు కొన్ని లేఖలు అవసరం. ఆ లేఖలు ఇవ్వాలని అడుగుతున్నా. అవి ఇస్తే రెండు వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తా. విశాఖ ఉక్కు విలువ రూ.3.5 లక్షల కోట్లు. దాన్ని రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు. దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే తెదేపా, వైకాపా, సీపీఐ నాయకులను కలిసేందుకు విశాఖపట్నం వచ్చా. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తానంటోంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు కేసీఆర్ మాట ఉంది. చంద్రబాబు రూ.5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్కు అప్పగిస్తే.. ఈయన మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవనాలన్నింటినీ ఏడాదిలో కట్టేస్తా. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ నాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు' అని కేఏ పాల్ పేర్కొన్నారు.
రూ.42 వేల కోట్లకు బిడ్ వేస్తా !
April 23, 2023
0
Tags